Thursday, August 1, 2024

కడుపులో గ్యాస్ సమస్యా.. ?

సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి డయాబెటీస్, బీపీ, హార్ట్‌ఎటాక్‌. అయితే వీటితోపాటు మరో సమస్య సైతం ప్రజల్ని వేధిస్తోంది. అది ఏంటంటే అసిడిటీ. దీన్నే కడుపులో మంట, గ్యాస్ పట్టేయడం అంటారు. మారిన అలవాట్లు, ఆహార పదార్థాల వల్ల ఇది వస్తోంది. నూనెతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తోంది.

అలాగే రుచికరంగా ఉండేందుకు వివిధ రకాల మసాలాలు ఆహారానికి పట్టించి తినడం, వేయించిన పదార్థాలు అతిగా తినడం వల్ల గ్యాస్ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కంటికి కనిపించదు కానీ రోగిని మాత్రం నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో రోజువారీ కార్యకలాపాలకు తీవ్రఇబ్బందులు సైతం ఎదురవుతాయి. అయితే కడుపులో గ్యాస్ పట్టినా లేదా మంటగా అనిపించినప్పుడు మనం కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బాధ నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

కడుపులో గ్యాస్ సమస్య పోయేందుకు ఎక్కువగా కీర దోసకాయ తినాలి. దీనిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి మంచి ఆహారం, నీరు దొరకడంతోపాటు, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరంగా ఉంటాయి. భోజనానికి ముందు కీరదోస సలాడ్‌గా తింటే మరీ మంచిది. అలాగే అరటిపండు తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. మిగతా పండ్లలాగా ఇది పెద్ద ఖరీదు కూడా కాదు. దీనిలో ఐరన్, కాల్షియం, పీచు పదార్థం పుష్కలంగా ఉండడంతో అసిడిటీ, అజీర్ణం సమస్యలు దూరం అవుతాయి.

రెగ్యులర్‌గా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. కొబ్బరినీళ్లు అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి. అందులోనూ ఇవి చాలా సహజమైనది కాబట్టి గ్యాస్ సమస్యతోపాటు అనేక రకాల ప్రయోజనాలు శరీరానికి చేకూరుతాయి. అలాగే నిమ్మకాయ నీరు తాగడం ద్వారా కూడా గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. నిమ్మరసం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి గ్యాస్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

No comments:

Post a Comment